
లక్ష్యం చేరని రుణం!
మొండిచేయి చూపుతున్న బ్యాంకర్లు
వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు ● ఈ సారైనా లక్ష్యం చేరుకునేనా?
జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ఏటేటా కేటాయింపులు పెంచుతూ ప్రణాళిక ఖరారు చేస్తున్నా.. రుణ పంపిణీ మాత్రం 70 శాతం మించడం లేదు. ఫలితంగా రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. జిల్లాలో 2025– 26 వార్షిక రుణ ప్రణాళిక రూ. 6,517.51 కోట్లుగా ఖరారు చేశారు.
– మెదక్జోన్
జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయ సాగు భూములు ఉండగా, 2.96 లక్షల మంది రైతులు ఉన్నారు. కాగా ఏటా రైతులకు పంట రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చి వార్షిక రుణ ప్రణాళికను ప్రకటిస్తున్నాయి. అయితే అందులో 70 శాతం రుణాలను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 2024– 25లో వార్షిక రుణ ప్రణాళిక వివిధ రంగాలకు రూ. 5,857 కోట్లు కేటాయించారు. కానీ ఇచ్చింది మాత్రం రూ. 4,366.84 కోట్లు మాత్రమే. ఇందులో వ్యవసాయం, అనుబంధ రుణాలు రూ. 3,647.75 కోట్లు కాగా, ఇచ్చింది మాత్రం రూ. 2,857.75 కోట్లు. అలాగే పంట రుణాల లక్ష్యం రూ. 2,267.25 కోట్లు కాగా, ఇచ్చింది రూ. 1,603.80 కోట్లు. అంటే కేవలం 70 శాతం రుణాలు మాత్రమే ఇచ్చి చేతులు దుపులుకున్నారు.
గతం కంటే ఎక్కువగా..
రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం ఏటా 10 శాతం పెంచుతూ వార్షిక రుణ ప్రణాళికను తయారు చేస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది 2025–26 రుణ ప్రణాళిక రూ. 6,517.51 కోట్లుగా ఖరారు చేశారు. గతేడాదితో పోలిస్తే రూ. 660.51 కోట్లు అదనంగా కేటాయించారు. ఇందులో పంట రుణాలు రూ. 1,977.46 కోట్లు కాగా, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ. 3,971.05 కోట్లు, ప్రాధాన్యత రంగానికి రూ. 5,481.60 కోట్ల చొప్పున కేటాయించారు.
చర్యలు తీసుకుంటాం
జిల్లాలో వార్షిక రుణాలు లక్ష్యం మేర ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. బ్యాంకుల వారీగా కేటాయించిన రుణాలు అందించే విధ ంగా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తాం. ఈ విషయంపై ప్రతి మూడు నెలలకోసారి కలెక్టర్ సమక్షంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తాం.
– నర్సింహమూర్తి,
లీడ్ బ్యాంక్ మేనేజర్ మెదక్

లక్ష్యం చేరని రుణం!