
నూనె గింజల ఉత్పత్తికి ఊతం
కొత్త పథకానికి శ్రీకారం● ఈ ఖరీఫ్ నుంచే ఎన్ఎంఈఓ అమలు ● రైతులకు ఉచితంగా కొత్త విత్తన రకాల సరఫరా ● లబ్ధిదారుల ఎంపికకు వ్యవసాయశాఖ సన్నాహాలు
పంటల వారీగా ఎంపిక చేసిన జిల్లాలు
సోయాబీన్ : సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్
పొద్దుతిరుగుడు : సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, భద్రాద్రి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి
వేరుశనగ : నల్లగొండ, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ, మహబూబ్నగర్, వికారాబాద్, నారాయణపేట
కుసుమ : సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్
నువ్వులు : జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వంట నూనె గింజల పంటల విస్తీర్ణం ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభు త్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్ఎంఈఓ (నేషనల్ మిషన్ ఆన్ ఈడబుల్ ఆయిల్) పథకం కింద సోయా, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, కుసుమ పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతులు సాంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పేలా..అధిక దిగుబడులు ఇచ్చే కొత్త రకాల విత్తనాలను ఉచితంగా సరఫరా చేయనుంది. అలాగే సంబంధిత వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాంకేతిక సహాయాన్ని అందించనుంది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఈ పథకాన్ని అమలు చేయనుంది. 2030 వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపుకు సన్నాహాలు చేస్తున్నారు.
అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల సరఫరా..
ఈ పథకం కింద ఎంపికై న రైతులకు ఉచితంగా నూనె గింజల విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేయనుంది. ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాలు (ఒక హెక్టారు)కు పరిమితి విధించారు. ఉదాహరణకు సోయా సాగు చేస్తున్న రైతులు 1994లో విడుదల చేసిన జే.ఎస్.–335 వైరెటీనే ఎక్కువగా విత్తుకుంటున్నారు. ఈ వైరెటీతో ఆశించిన దిగుబడి రావడం లేదు. వీటి స్థానంలో 2021లో రిలీజైన డీఎస్బీ–34, ఎంఏసీఎస్–1460 వైరెటీ సోయా విత్తనాలను సరఫరా చేస్తారు. అలాగే రైతు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. పంటలను ఎప్పటికప్పుడు పరిశీలించి, తగిన సూచనలు చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాంకేతిక సహాయాన్ని అందిస్తారు.
పాత వైరెటీలతో 60 శాతం తక్కువ దిగుబడి
కొత్తగా వచ్చిన నూనెగింజల విత్తన రకాలకు, ప్రస్తుతం రైతులు వాడుతున్న విత్తనాలకు వచ్చే దిగుబడిలో 60 శాతం తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సోయా పంటనే ఉదాహరణగా తీసుకుంటే కొత్త వైరెటీలు (2021లో రిలీజైన డీఎస్బీ–34, ఎంఏసీఎస్–1460 వైరెటీ) తో ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రైతులు మొగ్గు చూపేలా..
ప్రస్తుతం రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ రైతులు నూనెగింజల సాగు వైపు మొగ్గు చూపేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మరోవైపు దేశంలో నూనెగింజల ఉత్తత్తి చాలా తక్కువగా ఉంది. వివిధ దేశాల నుంచి నూనెగింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.