
హడావుడే.. ఆచరణేది?
● నామమాత్రంగా 100 రోజుల ప్రణాళిక
● ఆర్భాటాలకే పరిమితమైన అధికారులు
● ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు
వర్షాకాలంలో పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టింది. ఈనెల 2 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మాత్రం నామమాత్రంగా ప్రణాళిక కొనసాగుతోంది. కేవలం ఫొటోలు, ఆర్భాటాలకే అధికారులు పరిమితం అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – రామాయంపేట(మెదక్)
పట్టణంలో ఇళ్ల మధ్య నిలిచిన మురుగు నీరు
రామాయంపేట పట్టణంలోని కొన్ని వార్డుల్లో ఇళ్ల మధ్య, ఖాళీ స్థలాల్లో నిలిచిన మురుగు నీటితో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దోమలు విపరీతంగా పెరిగిపోగా, నివారణకు ఫాగింగ్ కూడా సక్రమంగా చేపట్టడం లేదు. ఉన్న రెండు ఫాగింగ్ యంత్రాల్లో ఒకటి చెడిపోవడంతో సమస్య తలెత్తింది. మున్సిపాలిటీ పరిధిలో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి దోమల నివారణ మందు మురుగు కాలువల్లో పిచికారీ చేయించాలి. ఇందుకోసం వార్డుల వారీగా అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు మాత్రం బ్యానర్ల ఎదుట ఫొటోలు తీసుకొని అధికారులకు పంపిస్తున్నారు. 100 రోజుల ప్రణాళిక ఈనెల 2వ తేదీన ప్రారంభం కాగా, సెప్టెంబర్ 10 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా తడి, పొడి చెత్త విషయమై స్థానికులకు అవగాహన కల్పించడంతో పాటు మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఎక్కువ సమస్యలు ఉన్న వార్డుల్లో ముందుగా ప్రణాళిక అమలు చేయాలనే ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కార్యక్రమం ప్రారంభమై ఇప్పటికీ 20 రోజులు అవుతున్నా, కేవలం నాలుగు వార్డుల్లో మాత్రమే పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి.

హడావుడే.. ఆచరణేది?