
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కొల్చారం(నర్సాపూర్): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మండలంలోని సంగాయిపేటలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొందరు తమ పేరు జాబితాలో వచ్చినప్పటికీ మంజూరు పత్రాలు ఇవ్వలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఇబ్బంది ఏర్పడిందని, సర్వే జరిపి నిజమైన అర్హులందరికీ మంజూరు పత్రాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణ పనుల సమయంలో లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు పనిచేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. బడి బయట ఉన్న వారు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసా, ఎంపీడీఓ కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి సదాశివుడు, హెచ్ఎం దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్రాజ్