
సీజనల్.. పరేషాన్!
జిల్లాలో 21 మండలాల పరిధిలో 693 గ్రామాలు ఉండగా, 7.67 లక్షల జనాభా ఉన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 19, అర్బన్ హెల్త్సెంటర్ 1, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 2, ఏరియా ఆస్పత్రి 1, జిల్లా కేంద్ర ఆస్పత్రి 1, ఎంసీహెచ్ 1, చొప్పున మొత్తం 25 ఆస్పత్రులు ఉన్నాయి. కాగా వానాకాలం సీజన్లో వచ్చే వ్యాధులను ముందస్తుగా గుర్తించి ప్రాణనష్టం జరగకుండా వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈనెల 1 నుంచి ముందస్తు జర్వ సర్వేను ప్రారంభించారు. జిల్లాలో ఒక్కో ఆశవర్కర్ 20 ఇళ్లను సర్వే చేసి ఎప్పటికప్పుడు సంబంధిత ఏఎన్ఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. జ్వర పీడితులను గుర్తించి వారికి చికిత్స ప్రారంభించటంతో పాటు వారి పేరు, ఊరు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం డ్రైడే, ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి దోమల నివారణ, పారిశుద్ధ్య చర్యల గురించి వివరిస్తున్నారు. కాగా గతేడాది వానాకాలం సీజన్ మొత్తంలో 16 వేల మంది జ్వర పీడితులు ఉంటే, కేవలం ఈ 20 రోజుల్లోనే 9,231 మంది జ్వర పీడితులను గుర్తించటం గమనార్హం.
పెద్దశంకరంపేటలో జ్వర సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈనెల 1 నుంచి జిల్లాలోముందస్తు జ్వర సర్వేను ప్రారంభించారు. కేవలం 20 రోజుల వ్యవధిలో 9 వేల పైచిలుకు జ్వర పీడితులను గుర్తించారు. వారికి వెంటనే వైద్య చికిత్స ప్రారంభించారు. అలాగే వ్యాధులు బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. – మెదక్జోన్
పరిశుభ్రతే ప్రధానం
ఈ ఏడాది సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడటం వైద్యారోగ్యశాఖ అధికారులకు కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి. గత 16 నెలలుగా పాలకవర్గాలు లేక పల్లెలో పాలన గాడితప్పింది. పంచాయతీ కార్యదర్శలు చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పోయలేమంటూ చేతులెత్తేశారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఈక్రమంలో జిల్లా అధికారులు గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.