
పంచాయతా.. పరిషత్తా?
‘స్థానిక’ ఎన్నికలపై జోరుగా చర్చ
● పల్లెల్లో మొదలైన పోరు సందడి ● స్థానిక సంస్థలకు నిలిచిన ఆర్థికసంఘం నిధులు ● పలు చోట్ల అభివృద్ధి పనులకు బ్రేక్ ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,531 జీపీలు, ఎంపీటీసీలు 690, జెడ్పీటీసీలు 72
ఉమ్మడి మెదక్ జిల్లాలో 19,62,458 మంది పల్లె ఓటర్లుండగా 1,531 గ్రామ పంచాయతీలు, 690 ఎంపీటీసీలు, 72 జెడ్పీటీసీలు ఉన్నాయి. గతేడాది జూలై 4వ తేదీతో మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు(ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడు (జెడ్పీటీసీ) పదవీకాలం, గతేడాది ఫిబ్రవరి 2తో సర్పంచ్ల పదవీకాలం ముగిశాయి. అప్పటి నుంచి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తే అధికార పార్టీకి లాభం అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి కావడంతో ప్రభుత్వ పాలన రెఫరండంగా భావించే అవకాశం ఉంది.
ఆశల్లో కాంగ్రెస్ నాయకులు
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లు రాష్ట్రపతి దగ్గరనే ఇంకా పెండింగ్లో ఉంది. బిల్లు ఆమోదం తర్వాతనే నిర్వహిస్తారా? పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారో.. వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు స్థానిక పదవుల పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది లేకపోవడంతో కొంత వెనుకబడి ఉంది. దీంతో ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి పదవులు దక్కితే పార్టీ కొంత బలపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందు జరుగుతాయా.. లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా? అని పల్లెల్లో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల ప్రకటనతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం వేగం పెంచింది. రైతు భరోసా కింద ఎకరానికి రూ. 6వేలు చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెలలో జరుగుతాయని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఆశావహులు సైతం పోటీకి రెడీ అవుతున్నారు. సాక్షి, సిద్దిపేట:
నిలిచిన ఆర్థిక సంఘం నిధులు
స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. అదే పాలక వర్గాలుంటే ప్రతీ ఏడాది కేంద్రం నుంచి ప్రత్యేక నిధులను కేటాయించేవారు. ఆర్థిక సంఘం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.