
సీసీ సస్పెన్షన్
● డ్వాక్రా రుణాల గోల్మాల్పై వేటు ● బ్యాంకు అధికారులపై చర్యలు కరువు
పాపన్నపేట(మెదక్): ‘సంఘాల నిధులు స్వాహా’ శీర్షికన గత నెల 15న సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన డీఆర్డీఏ అధికారులు నెల రోజులకు పైగా విచారణ జరిపారు. మహిళా సంఘాలకు సంబంధించి రూ. 39,92,141 నిధులను వీఓఏ పద్మ స్వాహా చేసినట్లు తేల్చారు. ఈ మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించిన సీసీ సాయిలును సస్పెండ్ చేస్తూ డీఆర్డీఓ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ గోల్మాల్లో బ్యాంకు అధికారుల పాత్ర సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పాపన్నపేట మండలం పొడిచన్పల్లిలో జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో 39 డ్వాక్రా గ్రూపులు ఉండగా, వీరికి యూకో బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తున్నారు. ఇందులో గ్రామ సంఘం నిధులతో పాటు, బ్యాంకు ద్వారా రెండు రకాల రుణాలు పొందవచ్చు. అయితే గ్రామ సంఘం నుంచి తీసుకునే రుణాలకు అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి సంతకాలతో తీర్మానం చేయాలి. ఇవి మొదట గ్రూపు అకౌంట్లో జమ చేసి తర్వాత సభ్యులకు పంపిణీ చేయాలి. కానీ వారి సంతకాలను ఫోర్జరీ చేసి సభ్యులకు తెలియకుండా గ్రామ వీఓఏ పద్మ సుమారు రూ. 26.50 లక్షలు సొంత అకౌంట్లోకి మళ్లించుకున్నట్లు డీపీఎం ప్రకాశ్ తెలిపారు. అయితే ఇందులో అప్పటి బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్లు తెలిసింది. అలాగే బ్యాంకు నుంచి మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చే రుణాలు సైతం సభ్యుల అకౌంట్లలోకి వెళ్లకుండా, నేరుగా వీఓఏ అకౌంట్లో జమ అయినట్లు తెలిసింది. ఇవి సుమారు రూ.13.40 లక్షల వరకు ఉన్నట్లు తేలింది. అయితే వీఓఏ ఈ విషయాలు బయట పడకుండా దొంగ రసీదులు, తీర్మానాలు, సంతకాల ఫోర్జరీ చేసి, అధికారులకు అనుమానం రాకుండా రికార్డులు నిర్వహించినట్లు సమాచారం. సీసీ నిర్లక్ష్యంతో అవినీతి భాగోతం సకాలంలో బయట పడలేదని భావించిన అధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా మహిళా సభ్యుల వ్యక్తిగత అకౌంట్లోకి వేయాల్సిన రుణాలను అప్పటి బ్యాంకు అధికారి వీఓఏతో కుమ్మకై ఆమె సొంత అకౌంట్లోకి మళ్లించారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయమై బ్యాంకు అధికారులు సైతం శాఖాపరమైన విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే సుమారు 35 రోజుల దాటినా వారి విచారణ కొలిక్కి రాకపోవడం గమనార్హం. వీఓఏ మాత్రం తాను సీసీతో పాటు ఏపీఎంలకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపించారు.

సీసీ సస్పెన్షన్