
అధికారులకు ప్రజల గోస పట్టదా?
● నాలుగు రోజులుగా నీరు రాకుంటేపట్టించుకోరా? ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలో గత 4 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల తాగునీటి గోస అధికారులకు పట్టదా? రేపటిలోగా సమస్య పరిష్కరించకుంటే పెద్దఎత్తున ధర్నా చేపడుతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేష్ను కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. పైప్లైన్ మరమ్మతు పనులు 4 రోజులుగా పూర్తి చేయకపోవడంపై అధికారుల సమన్వయ లోపం కనిపిస్తుందన్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా ప్రజలకు నీరు అందించలేకపోతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ము న్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.