
వైద్య విద్య.. మెరుగుపడేనా?
మెదక్జోన్: ప్రభుత్వ వైద్య కళాశాల ఏడాదిగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. నూతన భవన నిర్మాణానికి ఏడాది క్రితం నిధులు మంజూరైనా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ఇదిలాఉండగా ప్రయోగశాలలు, క్లినికల్ పారామీటర్లు లేవని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇటీవల ఆక్షేపించిన విషయం తెలిసిందే.
నూతన భవన నిర్మాణం ఎప్పుడో..?
గతేడాది జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు అయింది. దీంతో అద్దె భవనంలో తాత్కాలికంగా తరగతులు కొనసాగిస్తున్నారు. కళాశాల పక్కనే గల చిన్నపాటి గదుల్లో బాలురు ఒక వైపు, బాలికలు మరో పక్కన హాస్టళ్లలో ఉంటున్నారు. వసతి గృహాలను ఆనుకొని పిచ్చిమొక్కలు, గడ్డి, చెట్లు ఏపుగా పెరిగాయి. నిత్యం పాములు, విష పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా నూతన భవన నిర్మాణం కోసం ఏడాది క్రితం రూ. 180 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ. 150 కోట్లు భవన నిర్మాణానికి కాగా, మరో రూ. 30 కోట్లు మౌలిక వసతుల కోసం కేటాయించింది. విశాలమైన ప్రయోగశాలలు, ల్యాబ్లు, తరగతి గదులు, బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు తదితర భవన నిర్మాణాల కోసం 20 ఎకరాల స్థలం అవసరం అవుతుందని భావించారు. అందుకనుగుణంగా జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ ఆస్పత్రి పక్కన 11 ఎకరాల స్థలాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు మెడికల్ కళాశాలకు అప్పగించారు. ఈ స్థలంలో మూడు, లేదా నాలుగు అంతస్తుల భవనం నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. నిర్మాణం కోసం త్వరలో టెండర్ పిలుస్తామని సంబంధిత అధికారి తెలిపారు.
ఏడాదిగా అద్దె భవనంలో కొనసాగింపు
నిధులు మంజూరైనాప్రారంభం కాని పనులు
అరకొర వసతులతో విద్యార్థుల అవస్థలు
మరో 50 మంది విద్యార్థులు
గతేడాది జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కాగా, 50 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది సైతం విద్యార్థులను చేర్చుకోవాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆగస్టులో మరో 50 మంది విద్యార్థులు రానున్నారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న అద్దె భవనంలో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

వైద్య విద్య.. మెరుగుపడేనా?