
90 శాతం రెవెన్యూ సదస్సులు పూర్తి
కలెక్టర్ రాహుల్రాజ్
టేక్మాల్(మెదక్): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లాలో నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులు 90 శాతం పూర్తయినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం మండలంలోని ఎల్లంపల్లిలో రెవెన్యూ సదస్సును పరిశీలించి మాట్లాడారు. ఈనెల 3 నుంచి 20వ తేదీ వరకు చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా తహసీల్దార్ నేతృత్వంలో బృందాలు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తుందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల వివరాలతో సరిపోల్చుకొని, క్షేత్రస్థాయి విచారణను పకడ్బందీగా జరపాలన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకొని వారి సామర్థ్యాలను పరిక్షించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ తులసీరామ్, ఆర్ఐ సాయిశ్రీకాంత్, ఎంపీఓ రియాజొద్దీన్, కార్యదర్శి గొల్లసత్యం, నాయకులు కిష్టయ్య, రాజేశ్వర్గౌడ్, సాయిబాబ ఉన్నారు.