
సర్కార్ బడిలో టీచర్ కొడుకు
పాపన్నపేట(మెదక్)/తూప్రాన్: చాలామంది ప్రభుత్వ టీచర్లు తమ పిల్లలను ప్రైవేట్ బడికి పంపుతూ గ్రామస్తుల పిల్లలను మాత్రం సర్కార్ బడికి పంపాల్సిందిగా కోరుతారనే ప్రచారం ఉంది. అయితే ఆదర్శాలను ఆచరిస్తూ మిగతావారికి స్ఫూర్తి కలిగించాలని చెబుతుంటారు పెద్దలు. అలాంటి పనినే చేశాడో టీచర్. అందరూ ప్రైవేటు స్కూళ్ల మోజులో పడి తమ పిల్లల్ని అందుల్లో చేర్పిస్తుంటే ఓ టీచర్ మాత్రం సర్కారు బడిపై నమ్మకముంచి తన కుమారుడిని అందులోనే చేర్పించాడు. పాపన్నపేట మండలం పొడిచన్పల్లిలో మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పొడిచన్పల్లి గ్రామానికి చెందిన శ్రవణ్కుమార్ నాగ్సాన్పల్లి ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పని చేస్తున్నాడు. మెదక్లో నివాసం ఉంటున్నాడు. తన కొడుకు కల్యాణ్వర్ధన్ను తను పనిచేస్తున్న పాఠశాలలోనే చేర్పించి స్కూలుకు వచ్చేటప్పుడు తన వెంట తీసుకొస్తున్నాడు. టీచర్లు తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పిస్తే, సామాన్యులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని ఎంఇఓ ప్రతాప్రెడ్డి అన్నారు. గ్రామస్తులు కూడా టీచర్ శ్రవణ్ కుమార్ను అభినందించారు. వెల్దుర్తి మండలం కొప్పులపల్లి ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహేశ్గౌడ్ కూడా తన కుమారుడు అభిషేక్గౌడ్ను తూప్రాన్లోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలో 8వ తరగతిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. దీంతో మహేశ్ గౌడ్ను కూడా ఎంఈఓ సత్యనారాయణతోపాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

సర్కార్ బడిలో టీచర్ కొడుకు