
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
తూప్రాన్: ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. సోమవారం బడిబాటలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచాలని, అప్పుడే ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. అక్షరాస్యతలో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నామని, మొదటి స్థానానికి తేవడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక అమలవుతుందని తెలిపారు. అనంతరం క్విజ్ పోటీల్లో ప్రతిభ కనిబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, ఎంఈఓ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్, నాయకులు భూమన్నగారి జానకిరామ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు పోచయ్య తదితరులు పాల్గొన్నారు.