
సర్కారు కాలేజీ పిలుస్తోంది..!
కౌడిపల్లి(నర్సాపూర్): ‘ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివితే ఇంజనీరింగ్ ఉచితంగా చదవొచ్చు. ఇక్కడ పేద విద్యార్థులు మాత్రమే చదువుతారన్న భావన మీలో ఉండొద్దు. అనుభవం ఉన్న అధ్యాపకులతో నాణ్యమైన విద్యా బోధనతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం. క్రీడలు, ఎన్ఎస్ఎస్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’. అని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారంనిర్వహిస్తున్నారు.
అన్ని గ్రూపులు.. సరిపడా అధ్యాపకులు
కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉన్నాయి. అన్ని సబ్జెక్టులకు కలిపి 11 మంది లెక్చరర్లు ఉండగా, ఇంగ్లీష్, తెలుగు మీడియంలో విద్యాబోధన చేస్తున్నారు. గతేడాది 320 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివి ఎప్సెట్ కన్వీనర్ కోటాలో సీటు వచ్చిన విద్యార్థులకు వందశాతం ఫీజు రీయింబర్స్మెంట్తో బీటెక్ ఉచితంగా చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మిగితా వారికి అయితే కళాశాల స్థాయిని బట్టి కన్వీనర్ కోటాలో సీట్లు వచ్చిన విద్యార్థులకు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పైగా ఫీజు ఉంటుంది. కాగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం కేవలం రూ. 35 వేలు మాత్రమే ఇస్తుంది. మిగితా డబ్బులు చెల్లించా ల్సి ఉంటుంది.
ప్రభుత్వ కళాశాలలోచదివితే బీటెక్ ఉచితం
గ్రామాల్లో అధ్యాపకుల విస్తృత ప్రచారం
నాణ్యమైన బోధన అందిస్తున్నాం
ప్రైవేట్ కంటే ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యా బోధన అందుతుంది. ప్రభుత్వ కాలేజీలో చదివిన విద్యార్థులు బీటెక్ ఫ్రీగా చదవొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియక బీటెక్ కోసం రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు వినియోగించుకోవాలి. ఈఏడాది అడ్మిషన్లు జరుగుతున్నాయి.
– వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపాల్

సర్కారు కాలేజీ పిలుస్తోంది..!