
వేగవంతంగా బియ్యం పంపిణీ
కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్ మున్సిపాలిటీ: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మెదక్ మున్సిపాలిటీలోని 1వ వార్డు ఔరంగాబాద్ రేషన్షాపును పరిశీలించి మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీని వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 2,16,716 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా నెలకు సుమారు 4,522 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మూడు నెలల కోటా కలిపి మొత్తం 13,922 మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఇందులో 8,800 మెట్రిక్ టన్నులను ఇప్పటికే 520 రేషన్ దుకాణాలకు తరలించినట్లు చెప్పారు. ఈనెల 30 బియ్యం పంపిణీ కొనసాగుతుందన్నారు. పేదల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయ డం గొప్ప విషయమని కొనియాడారు. సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘రైతు నేస్తం’ ఏర్పాట్ల పరిశీలన
హవేళిఘణాపూర్(మెదక్): ఈనెల 16న మండల కేంద్రంలోని రైతువేదికలో జరిగే రైతు నేస్తం కార్యక్రమ ఏర్పాట్లను శనివారం కలెక్టర్ రాహుల్రాజ్ పరిశీలించారు. ఈసందర్భంగా వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి రైతులతో మాట్లాడుతారని తెలిపారు. అన్ని రైతు నేస్తం కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, ప్రజాప్రతినిధులు, రైతులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ తదితరులు ఉన్నారు.