
పాలన చేతకాకే కక్ష సాధింపు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
రామాయంపేట(మెదక్): సీఎం రేవంత్రెడ్డికి పరిపాలన చేతకాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అద్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. ఇటీవల మృతిచెందిన పార్టీ కార్యకర్త నర్సింలు కుటుంబానికి శనివారం రూ. 2 లక్షల బీమా చెక్కును అందజేసి మాట్లాడారు. రైతు భరోసా, సన్నరకం ధాన్యానికి బోనస్ విషయంలో ప్రభుత్వం రైతులను మోసగించిందని మండిపడ్డారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ కేటీఆర్కు రెండుసార్లు నోటీసులు జారీ చేశారన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. ఆర్థిక వ్యవస్థపై రేవంత్రెడ్డికి పట్టులేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. రైతుల శ్రేయస్సు గురించి ఎంతమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ముంబైలో మృతిచెందిన రాము కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆమె వెంట సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్గౌడ్, పార్టీ నిజాంపేట మండలశాఖ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, యూత్ విభాగం అధ్యక్షుడు జలంధర్ తదితరులు పాల్గొన్నారు.