
రైతులు ఇబ్బంది పడొద్దు
కలెక్టర్ రాహుల్రాజ్
23న జహీరాబాద్కు సీఎం రాక!
నిమ్జ్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‘మెపా’ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా యాదగిరి
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ నిర్వాహకులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని వెంకట్రావుపేట గేట్ వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల వద్ద జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వాలు ప్రాంతంలో ఉన్న ధాన్యం ఎత్తు ప్రదేశానికి తరలించాలన్నారు. కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని, తూకం వేసిన ధాన్యం వెంటనే లారీల్లో తరలించాలన్నారు. ఆన్లైన్లో సైతం త్వరగా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీ ఎం సంగమేశ్వర్, ఆర్ఐ శ్రీహరి, సీసీ నర్సింలు, కౌడిపల్లి ఎఫ్పీసీఎల్ అధ్యక్షురాలు రాజేశ్వరీ, నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
కొల్చారం(నర్సాపూర్): వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ వైద్య సిబ్బందికి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా రోగుల వార్డులు, వైద్య విభాగం గదులను పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి బాలింతలతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ వారంలో సంగారెడ్డి జిల్లాలో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నియో జకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు జిల్లాకు వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జిల్లాలో తొలిసారి అధికారికంగా పర్యటించనున్నారు. ఇటీవల సంగారెడ్డిలోని రాంమందిర్ వద్ద జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు వివాహ నిశ్చితార్థానికి రేవంత్రెడ్డి హజరైన విషయం విదితమే. నిమ్జ్ (జాతీయ ఉత్పాదక, పెట్టుబడుల మండలి)లో నిర్మించిన రోడ్డును సీఎం ప్రారంభించనున్నారు. అలాగే జహీరాబాద్లో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇతర అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అధికారులు చెబుతున్నారు.
30 వేల మందితో సభ!
సీఎం జిల్లా పర్యటన సందర్భంగా జహీరాబాద్ లో బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ సభకు సుమారు 30 వేల మందిని తరలించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సీఎం పర్యటన షెడ్యూల్ త్వరలో అధికారికంగా ఖరారయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో ఒకటీ రెండు రోజుల్లో జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాట్లను ప్రారంభించేందుకు జహీరాబాద్ వెళ్లనున్నారు.
వర్గల్(గజ్వేల్): ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన దుండిగల్ యాదగిరి నియమితులయ్యారు. మండలంలో సీఆర్పీగా పనిచేస్తున్న యాదగిరి ప్రస్తుతం సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశంలో తనను ‘మెపా’ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియామకం చేసినట్లు యాదగిరి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రాష్ట్రంలో ముదిరాజ్ల ఐక్యత, అభివృద్ధి కోసం శక్తివంచనలేకుండా కృషి చేస్తానని అన్నారు.