
ఎల్ఆర్ఎస్.. అంతంతే!
రాయితీ ఇచ్చినా స్పందన కరువు
● ముందుకు రాని దరఖాస్తుదారులు
● రేపటితో ముగియనున్న గడువు
మెదక్జోన్: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించినా ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది. యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేసినా దరఖాస్తుదారులు మందుకు రావడం లేదు.
2020లో స్కీం ప్రారంభ ం
గత ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ స్కీంను తీసుకురాగా.. అప్పట్లో జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 14,762 మంది ఆన్లైన్ ద్వారా రూ. 1,000 చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్పై కదలిక వచ్చింది. దరఖాస్తుదారులు మార్చి 31 లోగా ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయ్యే ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తామని చెప్పింది. అయినా పెద్దగా స్పందన రాకపోవడంతో ఏప్రిల్ వరకు అవకాశం ఇచ్చారు. మారోమారు ఈనెల 3 వరకు గడువు పొడిగించారు. అయితే దరఖాస్తులు వేలల్లో ఉండండం, సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత, సమన్వయ లోపంతో ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. ఇదిలాఉండగా హైడ్రా భయం జిల్లాను సైతం వెంటాడుతుంది. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువశాతం అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్లతో పాటు బఫర్జోన్లో సైతం ప్లాట్లను కొనుగోలు చేశారు. మరికొందరు వ్యవసాయ భూముల్లోనూ కొనుగోలు చేశారు. అలాంటి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసినా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాక కూలిస్తే మా పరిస్థితి ఏంటని పలువురు పేర్కొంటున్నారు. అందుకే ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
రుసుము చెల్లించింది 4,606 మందే..
జిల్లాలో 14,762 మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా, రెండు నెలల వ్యవధిలో కేవలం 4,606 మంది మాత్రమే ఫీజు చెల్లించారు. ఇంకా 10,156 మంది ముందుకు రావడం లేదు. ఈ లెక్కన కేవలం 26 శాతం మాత్రమే చెల్లింపులు జరిగాయి. అయితే రాయితీ గడువు ఈనెల 3వ తేదీతో ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే మరో నెల పొడిగించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.