భీమారం: జిల్లాలో వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం భీమారం అటవీ ప్రాంతంలో నిర్వహించిన వనమహోత్సవంలో జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్కిషన్ జాదవ్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం విజయవంతం చేయాలని కోరారు. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 41 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించాలని అన్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, డీఆర్డీవో కిషన్, సర్పంచ్ విజయలక్ష్మి పాల్గొన్నారు.


