తగ్గని ఎండలు.. జాడలేని వానలు ఖరీఫ్ సాగుపై అన్నదాతల ఆందోళన మృగశిర కార్తెతో వ్యవసాయ పనులు వేగవంతం ముంచుకొస్తున్న విత్తనాలు విత్తే సమయం
మంచిర్యాలఅగ్రికల్చర్: ఖరీఫ్ సాగుకు సిద్ధమైన కర్షకులను ఎల్నినో కలవర పెడుతోంది. వానాకాలం సాగుపై ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురుస్తాయో లేదోననే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో రుతు పవనాలు విస్తరించి భారీ వర్షాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 41నుంచి 43డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఇప్పటికే వ్యవసాయ అధికారులు, సాగు, విత్తన, ఎరువుల ప్రణాళిక సిద్ధం చేశారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే సాగు ప్రణాళికలో మార్పులు, చేర్పులు ఉంటాయని, రైతులు దీర్ఘకాలిక రకాలు కాకుండా స్వల్పకాలిక కంది, మొక్కజొన్న, పెసర, మినుము, ఆరుతడి పంటల సాగుకు అవగాహన కల్పిస్తున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో జూన్, జూలైలో సాధారణ వర్షపాతం ఉంటుందని, ఆగస్టు, సెప్టెంబర్లో తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
జిల్లాలో..
జిల్లాలో చిన్న, సన్నకారు, కౌలు రైతులు 1.57లక్షల మంది ఉన్నారు. ఖరీఫ్లో 3.57 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ప్రధానంగా పత్తి, వరి పంటలు సాగు చేస్తున్నారు. సాగునీటి సౌకర్యాలు అవసరం మేరకు లేకపోవడంతో 80శాతం వర్షాధారంగానే పంటలు సాగవుతున్నాయి.


