మంచిర్యాలక్రైం: కేసులు పరిష్కారానికి కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20న జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తామని తెలిపారు. చాలకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల్లో కక్షిదారులు రాజీ కదుర్చుకోవాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా కొట్టివేసిన కేసుల్లో మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని, దీని ద్వారా రెండు వర్గాల వారు కేసులో విజయం సాధించినట్లేనని తెలిపారు. సివిల్, రాజీకి తగిన క్రిమినల్ కేసులు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, సైబర్ క్రైమ్స్ కేసులు పరిష్కరిస్తామని తెలిపారు. వివరాలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ, మండల న్యాయసేవాధికార సంస్థలో సంప్రదించాలని సూచించారు.


