● బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్రావు ● దండేపల్లిలో రైతుల రాస్తారోకో
దండేపల్లి: వరి, మొక్కజొన్న కొనుగోళ్లలో ఆంక్షలు ఎత్తివేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎన్.విజిత్రావు డిమాండ్ చేశారు. దండేపల్లిలో రైతులతో కలసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసుకుని రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు, రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల బస్తాకు అదనంగా మరో మూడు కిలోలు తూకం వేయడం, బస్తాలను మిల్లులకు తరలించేందుకు లారీ వాళ్లకు బస్తాకు రూ.2 లేదా రూ.3 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. మొక్కజొన్న ఎకరాకు 26 క్వింటాళ్లే కొంటామంటే మిగతాది ఎవరికి అమ్ముకోవాలని ప్రశ్నించారు. ప్రేంసాగర్రావు ఎమ్మెల్యేగా ఎన్నికై న కొత్తలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల బస్తాకు ఒక గింజ కూడా ఎక్కువగా తూకం వేయకూడదని చెప్పి, కొనుగోలు కేంద్రాల్లో ఇంత జరుగుతున్నా ఇటువైపు కన్నెత్తిచూడడం లేదని విజిత్రావు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏ ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తహసీల్దార్ రోహిత్దేశ్పాండే హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నాయకులు, రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు అనిల్, రవి, సంతోష్, భూమన్న, తిరుపతి, అజయ్, రమణ, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.


