
మత్తు వదలరా..!
● జిల్లాలో యథేచ్ఛగా గంజాయి విక్రయం, వినియోగం ● వాట్సాప్లో అమ్మకం, అడ్డాలు, సమయంపై సమాచారం ● నియంత్రణకు ట్రాకింగ్ డాగ్స్ వినియోగం
మంచిర్యాలక్రైం: జిల్లాలో గంజాయి దందాపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ, ఈ చీకటి వ్యాపారం తగ్గడం లేదు. గంజాయి మత్తులో యువత దాడులకు తెగబడటం, బెదిరింపులతో డబ్బులు లాక్కోవడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బాధ్యతలు చేపట్టిన తర్వాత, జిల్లాను గంజాయి రహితంగా మార్చడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అయినా క్షేత్రస్థాయిలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. చిన్న ప్యాకెట్లలో గంజాయి రవాణా, విక్రయాలను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.
యువతే లక్ష్యంగా వ్యాపారం..
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులను గంజాయి స్మగ్లర్లు టార్గెట్ చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివే యువత నుంచి రోడ్లపై తిరిగే యువకుల వరకు గంజాయికి బానిసలవుతున్నారు. గంజాయి సేవనంతో కలిగే ఆరోగ్య సమస్యలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక బాధ్యతగా, మత్తులో ఉన్న యువతను సన్మార్గంలోకి తీసుకొచ్చేందుకు వివిధ చర్యలు చేపడుతున్నారు.
సోషల్ మీడియా వేదిక..
సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ గంజాయి అమ్మకాలకు అడ్డాగా మారింది. గంజాయి సేవించే వారు వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకుని, కోడ్ భాషలో సమాచారం పంపుతూ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 100 గ్రాముల ప్యాకెట్లను రూ.200 నుంచి రూ.300కి విక్రయిస్తూ, రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య నిర్దిష్ట ప్రాంతాల్లో డెలివరీ చేస్తున్నారు. శ్రీరాంపూర్ రింగ్ రోడ్, రైల్వే స్టేషన్, కాలేజీ రోడ్, రాజీవ్ నగర్, ఎన్టీఆర్ నగర్, జాఫర్ నగర్, అండలమ్మ కాలనీ, తిలక్నగర్, బైపాస్ రోడ్ వంటి ప్రాంతాలు గంజాయి అమ్మకాలకు అడ్డాలుగా మారాయి. గతంలో గంజాయి వాడకం మాస్ ఏరియాలకు పరిమితమైనప్పటికీ, ఇప్పుడు క్లాస్ ఏరియాల్లోనూ జోరుగా సాగుతోంది.
సిగరెట్లలో గంజాయి..
పట్టణ కేంద్రాల్లోని పాన్ షాపులు, టీ స్టాల్స్ వద్ద గంజాయిని సిగరెట్లలో దాచి రహస్యంగా విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఓ టీ స్టాల్ గంజాయి సిగరెట్ల విక్రయ కేంద్రంగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. రోజూ వందల మంది యువత ఇక్కడికి వచ్చి, కోడ్ భాషలో గంజాయి సిగరెట్లను కొనుగోలు చేస్తున్నారు.
పెరుగుతున్న బానిసలు..
పోలీసు లెక్కల ప్రకారం, జిల్లాలో గంజాయి వా డకం గణనీయంగా పెరిగింది. గతంలో పట్టణ ప్రా ంతాలకే పరిమితమైన గంజాయి వాడకం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. గంజాయి వ్యసనం యువతను సామాజిక, ఆరోగ్య సమస్యల వైపు నడిపిస్తోంది. పోలీసులు ఈ వ్యసనాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలతో పాటు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ, గంజాయి దందా పూర్తిగా నియంత్రణలోకి రావడం లేదు.
ట్రాకింగ్ డాగ్స్తో తనిఖీలు
గంజాయి వాసన పసిగట్టే ట్రాకింగ్ డాగ్స్ సాయంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాత నేరస్థుల ఇళ్లు, పాన్ షాపుల్లో రాత్రిపగలు తేడా లేకుండా తనిఖీలు చేస్తున్నారు. అయినా, కచ్చితమైన సమాచారం లే నప్పుడు గంజాయి విక్రయాలను నియంత్రించడం కష్టంగా మారుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే 20 వరకు 30 కేసులు నమోదు కావడం, 95 మంది నిందితులను అరెస్ట్ చేయడం జిల్లాలో దందా ఏరీతిని సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో గంజాయి దందా నడిపిన 22 మంది ముఠాను పట్టుకుని, 23.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా, రూ.10.37 లక్షల విలువై న 34 కిలోల గంజాయిని ఈ ఏడాది స్వా ధీనం చేసుకున్నారు.
రంగంలోకి ట్రాకింగ్ డాగ్స్..
గంజాయి విక్రయాలు, రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. పోలీస్ శాఖ గంజాయి నియంత్రణకు నార్కోటిక్ టీమ్లను ఏర్పాటు చేసింది. స్పెషల్గా గంజాయి నియంత్రణకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న ట్రాకింగ్ డాగ్స్ను వినియోగిస్తున్నాం. జిల్లాకు అధికంగా మహారాష్ట్ర నుంచి వస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పోలీసులకు గంజాయి సమాచారం అందించి నియంత్రణకు కృషి చేయాలి. యువతను పేడదోవ పట్టకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం.
– ఎగ్గడి భాస్కర్, డీసీపీ మంచిర్యాల

మత్తు వదలరా..!