అందుబాటులోకి రాని సేవలు | - | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి రాని సేవలు

Mar 14 2025 12:51 AM | Updated on Mar 14 2025 1:16 AM

అచ్చంపేట: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే టన్నెల్‌ చివరి 40 మీటర్ల వద్ద ప్రమాదకర స్థలంలో సహాయక చర్యల కోసం తీసుకొచ్చిన రోబోల సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. బుధవారం అన్వి రోబోటిక్‌ సంస్థకు చెందిన అటానమస్‌ హైడ్రాలిక్‌ పవర్డ్‌ రోబోను టన్నెల్‌ లోపలికి పంపించారు. కానీ, గురువారం సాయంత్రం వరకు 30 గంటలు గడిచినా ప్రమాద స్థలంలో రోబో పనితనం మొదలుకాలేదు. ఇప్పటి వరకు హైడ్రాలిక్‌ పవర్‌ రోబో లోపల ఏం చేస్తుందో అధికారులు వివరించలేదు. అత్యంత ప్రమాదకరమైన డీ– 1, 2 ప్రదేశాలకుి చేరుకోవడం ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. రోబోకు అవసరమైన సాంకేతిక లోపాలు ఎదరవుతున్నాయి. మొత్తం మూడు స్టేజీల్లో తవ్వకాలు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు మొదటి స్టేజీలోని శిథిలాలు, మట్టి, బురద, ఇనుప రాడ్లు, రాళ్లు తొలగిస్తున్నారు. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. టీబీఎం మిషన్‌ ఉన్న ప్రాంతానికి మినీ జేసీబీ వెళ్తుండటంతో సహాయక చర్యల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. 200 మంది రెస్క్యూ బృందాలను తగ్గించి ఎక్కువగా సింగరేణి కార్మికులతో శ్రమిస్తున్నారు. సొరంగంలో దుర్వాసన కూడా తగ్గినట్లు సహాయక సిబ్బంది చెబుతున్నారు. పేరుకుపోయిన బురద, రాళ్లు తొలగిస్తూ దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా కట్టర్స్‌, థర్మల్‌ గ్యాస్‌ కట్టర్‌తో టీబీఎం విడి భాగాలను కట్‌ చేస్తూ లోపలి నుంచి బయటికి తెస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు తీసిన శిథిలాలను బయటికి తీసుకొచ్చారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో భూగర్భ పరిస్థితులను తెలుసుకునేందకు జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) ప్రతినిధుల బృందం తొమ్మిది రోజుల వ్యవధిలో 200 మీటర్ల వరకు మాత్రమే సర్వే చేయగలిగారు. మరో 250 మీటర్లు సర్వే చేస్తే తప్ప సొరంగం పైభాగం కూలడానికి గల కారణాలు తెలియవు. టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఒకరి మృతదేహం బయటికి తీసుకురాగా, మిగతా ఏడుగురి కోసం సర్వశక్తులు వడ్డుతున్నారు. అత్యున్నత సాంకేతికను వాడుతూ ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ్‌, సింగరేణి, హైడ్రా, రాడర్‌ హోల్‌ మైనర్స్‌ వంటి 12 బృందాలు 20 రోజులుగా నిరంతరం శ్రమిస్తూ వారీ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండు రోజుల నుంచి కన్వేయర్‌ బెల్టుకు సరిపడా మెటీరియల్‌ లేక పనిచేయడం లేదు. మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

మరోసారి డాగ్స్‌ సాయం

సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ కనుకొనేందుకు డీ– 1, 2 వద్ద సింగరేణి, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ బృందాలు తవ్వకాలు చేపడుతున్నారు. డీ–2 వద్ద కేరళకు చెందిన కాడవర్‌ డాగ్స్‌ పసిగట్టిన ప్రదేశంలో నాలుగు రోజులుగా తవ్వకాలు జరిపారు. ఇక్కడ టీబీఎం మిషన్‌కు చెందిన రాడ్లు, బేస్‌, శిథిలాలు కనిపించడంతో గురువారం వాటిని బయటికి తీసుకువచ్చారు. అక్కడ మిగతా ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో మరోసారి డాగ్స్‌ను లోపలికి తీసుకెళ్లారు. అవి పసిగట్టే ప్రదేశాల్లో మరోసారి తవ్వకాలు చేపట్టి కార్మికుల ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

హైడ్రాలిక్‌ పవర్డ్‌ రోబో యంత్రానికి అవరోధం

అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో సాంకేతిక సమస్యలు

30 గంటలు గడిచినా వివరాలు వెల్లడించని అధికారులు

ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు

అందుబాటులోకి రాని సేవలు 1
1/2

అందుబాటులోకి రాని సేవలు

అందుబాటులోకి రాని సేవలు 2
2/2

అందుబాటులోకి రాని సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement