పంట మార్పిడితో లాభాలు | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడితో లాభాలు

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

డోర్నకల్‌: పంట మార్పిడి, సేంద్రియ పద్ధతిలో పంటల సాగుతో లాభాలు గడించవచ్చని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. మండలంలోని చి లుకోడు రైతువేదికలో సోమవారం రైతు వారోత్సవాలను కలెక్టర్‌ ప్రారంభించారు. మందుల పిచికారీ విధానం, ఆధునిక వ్యసాయ పరికరాల పనితీరు, నానో యూరియా వాడకం తదితరాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. భూసార పరీక్షల ధ్రువీకరణ పత్రాలను రైతులకు పంపిణీ చేసిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. పంటల్లో మితిమీరిన రసాయన ఎరువులతో అనర్థాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న పంట సాగుతో అధిక దిగుబడులు రావడంతో పంటల నిల్వ కష్టమవుతోందన్నారు. రైతులు ఆయిల్‌పామ్‌, పప్పు దినుసుల పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఏఓ సరిత, ఆత్మ చైర్మన్‌ నల్లు సుధాకర్‌రెడ్డి, ఏఓ పవన్‌కమార్‌, సర్పంచ్‌ రాయల వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్‌ రమణబోయిన రాజు ఏఈఓ అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షాలపై

అప్రమత్తంగా ఉండాలి

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మహబూబాబాద్‌: అకాల వర్షాలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీహరి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ తదితర విషయాలపై కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్ష సూచన ఉన్నప్పుడు ముందుగానే రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి ధాన్యం కొనుగోలును విజయవంతం చేయాలన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్‌ స్నేహశబరీష్‌, అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా హేమాచలుడి తెప్పోత్సవం

మంగపేట: మల్లూరులోని హేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు మరళీకృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణతో సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆలయంలోని మూలవిరాట్‌కు నిత్య పూజ, యాగశాలలో సేవాకాలం, బాలభోగం, చతుస్థానార్చన ఆలయ సమీపంలోని ఎద్దు ముక్కు వద్ద గల ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం(స్నపనం) మహానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 7 నుంచి 9గంటల వరకు చతుస్థానార్చన, తెప్పోత్సవం, దోపోత్సవం, శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం, హవనం కార్యక్రమ క్రతువులను నిర్వహించారు. లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పల్లకీ(సేవ)పై మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోని కొలనులో రెండు గంటల పాటు తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఆలయ ప్రాంగణంలో దోపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు ముక్కామల శేఖర్‌ శర్మ, కారంపుడి పవన్‌కుమార్‌, అనిపెద్ది రాజీవ్‌శర్మ, ఏడునూతుల ఈశ్వర్‌చంద్‌ రామానుజం, బ్రహ్మోత్సవాల యాగ్నికులు పెరంబదూర్‌ మధనమోహనాచార్యులు, శ్రీ కృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాధ్‌, శ్రీరంగం వెంకటాచార్యులు, బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement