నెల్లికుదురు: రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు వస్తే ప్రభుత్వం కనీసం గన్నీ సంచులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కాచికల్ క్రాస్రోడ్ బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై రామన్నగూడెం సొసైటీ, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరతతో కాంటాలు నిర్వహించడం లేదని, గన్నీ సంచులు ఇవ్వడం లేదని రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈక్రమంలో తొర్రూరు నుంచి మహబూబాబాద్ వైపునకు వెళ్తున్న మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. జిల్లాలోని ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాల్లో సరిపోను హమాలీలు, గన్నీ సంచులు లేక కాంటాలు జరగడం లేదని మండిపడ్డారు. త్వరితగతిన కాంటాలు నిర్వహించి కొనుగోళ్లు పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నాయకులు, రైతులు పులి రామచంద్రు, వెన్నాకుల శ్రీనివాస్ పాల్గొన్నారు.


