‘డ్వాక్రా’ సంఘాల్లో గందరగోళం
మహబూబాబాద్: కొన్ని డ్వాక్రా గ్రూపుల లీడర్లు, ఆర్పీలు సభ్యులకు తెలియకుండా రుణం డబ్బులు డ్రా చేశారు. దీంతో ఆయా సంఘాల సభ్యులు న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడంతోపాటు మెప్మా కార్యాలయంలో వినతులు అందచేశారు. బ్యాంక్ సిబ్బంది సహకారాలతోనే డబ్బులు కాజేస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. మెప్మా అధికారులు పరిష్కారం చేయకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు చేసినట్లు సమాచారం.
2,701 డ్వాక్రాగ్రూపు సంఘాలు
మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) పరిధిలో మానుకోట, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, కేసముద్రం మున్సిపాలిటీ ఉన్నాయి. కాగా, కేసముద్రం మున్సిపాలిటీగా మారినా ఆన్లైన్లో సమాచారం నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో 339 డ్వాక్రా గ్రూపులు 3,092 మంది సభ్యులు ఉన్నారు. మానుకోట మున్సిపాలిటీలో 1,620 గ్రూపులు 15,617 మంది సభ్యులు, మరిపెడ పరిధిలో 331 సంఘాలు, 3,273 మంది సభ్యులు, తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 411 సంఘాలు 4,044 మంది సభ్యులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రతీ గ్రూపులో అధ్యక్షురాలు, కార్యదర్శితోపాటు 8 మంది సభ్యులు ఉంటారు. రుణాల మంజూరు పత్రాల తయారీ ఇతరత్రా మెప్మా కార్యాలయంలోనే జరుగుతాయి.
98 మంది ఆర్పీలు
నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 98 మంది రిసోర్స్ పర్సన్లు, ఒక ఆర్పీ పరిధిలో 18 నుంచి 25 సంఘాలు ఉంటాయి. సంఘాలతో సమావేశాలు, ప్రభుత్వ పథకాలు, రుణాలు ఇప్పించడం వీరి పని. కానీ, కొంతమంది ఆర్పీలు కాసులకు కక్కుర్తిపడి కొన్ని సంఘాల లీడర్లతో కుమ్మక్కై కొంతమంది బ్యాంక్ సిబ్బంది సహకారంతో డబ్బులు డ్రా చేస్తున్నారు. గ్రూపు పేరున ఆర్పీ బి.జయ, లీడర్లు కలిసి రుణం డబ్బులు డ్రా చేసి రూ.పది లక్షలు కాజేశారని ఈ ఏడాది ఆగస్టులో జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఎంపీఎస్ డ్వాక్రా గ్రూపు సభ్యుల్లో ఐదుగురు మెప్మా కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. తమ సంతకాలు పోర్జరీ చేసి రుణం కాజేశారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మెప్మా అధికారుల విచారణలో.. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అధికారులు రుణం మంజూరు చేశారని తేలింది. దీంతో రూ.10 లక్షలు రికవరీ చేయించినట్లు అధికారులు వెల్లడించారు.
2024 నవంబర్ 21న జిల్లా కేంద్రానికి చెందిన శ్రీమహాలక్ష్మి గ్రూపు సభ్యులు కూడా రుణం విషయంలో అన్యాయం జరిగిందని బ్యాంక్ అధికారులు తప్పు చేశారని ఆందోళన చేశారు. డోర్నకల్ మున్సిపాలిటీలో కూడా పలు సంఘాల సభ్యులు తమకు తెలియకుండానే డబ్బులు డ్రా చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రికవరీ చేస్తున్నాం
బ్యాంక్ అధికారుల తప్పిదంతోనే రుణం మంజూరైంది. మెప్మా నుంచి ఎంసీపీ డాక్యుమెంట్లు ఇతరత్రా లేకుండానే రుణం ఇచ్చారు. గ్రూపు రుణం మంజూరు కాగా.. కొంతమంది రుణం వద్దని చెప్పడంతో మిగిలిన వారు, ఆర్పీ కలిసి రుణం డబ్బులు తీసుకున్నారు. కేవలం వారి టార్గెట్ కోసమే రుణం డబ్బులు ఇచ్చారు.
– విజయ, మెప్మా పీడీ
సభ్యులకు తెలియకుండానే
రుణం నగదు డ్రా
ఆర్పీల నిర్వాకంతో దందా
కొంత మంది బ్యాంక్ సిబ్బంది
తప్పిదాలతోనే..?
న్యాయం చేయాలని మహిళల వేడుకోలు
‘డ్వాక్రా’ సంఘాల్లో గందరగోళం


