
టీజీ ఎడ్సెట్–25 ప్రశాంతం
రెండు సెషన్లలో కలిపి 83.79శాతం హాజరు
కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరం ప్రవేశానికి ఆదివారం కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యాన ఆన్లైన్ కంప్యూటర్ సిస్టం ద్వారా నిర్వహించిన ‘టీజీ ఎడ్సెట్’ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని 9 సెంటర్లలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షకు 2,190 మంది విద్యార్థులకు 1,821 మంది(83.15శాతం), మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షకు 2,110 మందికి 1782 మంది(84.45శాతం) హాజరయ్యారు. రెండు సెషన్లు కలిపి 4,300 మంది విద్యార్థులకు 3,603 మంది (83.79శాతం) హాజరైనట్లు టీజీ ఎడ్సెట్ కన్వీనర్, కేయూ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి.వెంకట్రామ్రెడ్డి తెలిపారు.
ప్రశ్నపత్రాల సెట్ల ఎంపిక
కేయూలోని ఎడ్సెట్ కార్యాలయంలో ఉదయం సెషన్ సెట్–ఎ ప్రశ్న పత్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి, రెండో సెషన్ సెట్–బి ప్రశ్న పత్రాన్ని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి ఎంపిక చేశారు. ఎంపిక కార్యక్రంమలో కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఇ.పురుషోత్తమ్, ఆచార్య మొహమ్మద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్, కన్వీనర్ బి.వెంకట్రామ్రెడ్డి, విద్యావిభాగం డీన్ రాంనాఽథ్కిషన్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, పాలకమండలి సభ్యులు బి.సురేష్లాల్ తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన చైర్మన్, వీసీ
ఉమ్మడి జిల్లా కేంద్రంలోని మోక్షిత ఇన్స్టిట్యూట్, బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ, హనుమకొండలోని ఆయాన్ డిజిటల్, నోబెల్ ఇన్స్టిట్యూట్ తదితర పరీక్ష కేంద్రాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, కేయూ వీసీ ప్రతాప్రడెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, టీజీ ఎడ్సెట్ కన్వీనర్ బి.వెంకట్రామ్రెడ్డి పరిశీలించారు.