
‘ఆపరేషన్ కగార్’ నిలిపివేయాలి
మహబూబాబాద్: ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అమరవీరుల స్తూపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విషపూరితమైన పాలన కొనసాగిస్తుందన్నారు. మావోయిస్టుల శవాలను సక్రమంగా భద్రపర్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కేంద్రం అమలు చేయడం లేదన్నానరు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై దాడులు, హత్యలు చేస్తుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం మొదట దళితులపై, తర్వాత మైనార్టీలపై దాడులు చేసి చివరికి మావోయిస్టులను టార్గెట్ చేసిందన్నారు. ప్రజల ఆంక్షలు, డిమాండ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు ముందు ఉంచేందుకు మావోయిస్టులు పోరాటం చేస్తున్నారన్నారు. బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలు సంఘాల నాయకులు రమాదేవి, నాగభూషణం, కుమారస్వామి, సంజీవ, చంద్రన్న, మండల వెంకన్న, గౌని ఐలయ్య, హెచ్.లింగన్న, హరినాయక్, బీమా నాయక్, ఉపేందర్, వెంకన్న, అశోక్, గీత, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.