
ఆధ్యాత్మికతతోనే నైతిక విలువలు
హన్మకొండ కల్చరల్: ఆధ్యాత్మికతతోనే నైతిక విలువుల పెంపొందుతాయని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు వర్ధనీపూజ, యాగశాల ప్రవేశం, భూతోత్సాదనం, యాగమండప స్థూనపూజ, ద్వారతోరణపూజ, అగ్నిప్రతిష్ఠ, సర్వతోభద్ర, నవగ్రహ, వాస్తుయోగినీ చతుషష్ఠి భైరవ మండల పూజ, క్షేత్ర పాలక మండల దేవతా యజనం పూజ, చతుఃస్థానార్చన, భేరీపూజ జరిపా రు. అమ్మవారిని పూలదండలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం వృషభవాహనంపై ఊరేగించారు. అనంతరం ధ్వజారోహణం చేశారు. అమ్మవారి సేవా కార్యక్రమాలకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉభయదాతలుగా వ్యవహరించారు. బండా ప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె అశోక్, మహానగర అధ్యక్షుడు బయ్యస్వామి, ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్, బండి సారంగపాణి, పొన్నం మొగిలి తదితరులు పాల్గొన్నారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి రాష్ట్ర పద్మశాలి పురోహిత సంఘం అధ్యక్షుడు రుద్ర పాండురంగశాస్త్రి, శ్రీవైలం, చెన్న కేశవులు అమ్మవారి కల్యాణం కోసం ప్రత్యేకంగా నేసిన పట్టుచీరను సమర్పించారు. సాయంత్రం మృగ వాహనంపై ఉత్సవమూర్తిని ఊరేగించారు. బుధవారం అక్షయతృతీయ కావడంతో వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్