
జిల్లాలో 99.29 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత
‘టెన్త్’ ఫలితాల్లోనూ బాలికలదే హవా
99.39 శాతం బాలికల ఉత్తీర్ణత
99.2శాతం బాలురు పాస్
మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా 99.29శాతం ఉత్తీర్ణత సాధించింది. 8,184 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 8,126 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 4,229మంది బాలురకు 4,195 మంది 99.2శాతంతో ఉత్తీర్ణులయ్యారు. 3,955 మంది బాలికలకు 3,931మంది 99.39శాతంతో పాస్ అయ్యారు. కాగా ఇంటర్ ఫలితాలను కొనసాగిస్తూ పదో తరగతి ఫలితాల్లోనూ బాలికల హవా కొనసాగింది. 2024 ఫలితాల్లో 94.62శాతం ఉత్తీర్ణతో జిల్లా 12వ స్థానంలో నిలువగా.. ప్రస్తుతం మొదటిస్థానంలో నిలిచింది.
100శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు..
జిల్లాలోని 8 మోడల్ స్కూళ్లు, 7 కేజీబీవీలు, 26 జెడ్పీ పాఠశాలలు, 5 బీసీ వెల్ఫేర్, 3 మైనార్టీ గురుకులాలు, 5 సోషల్ వెల్ఫేర్, 4 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. అలాగే మినీ రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2,987మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు.
అందరి భాగస్వామ్యంతోనే ఉత్తమ ఫలితాలు సాధించాం
కలెక్టర్ చొరవ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఉత్తమ బోధనతో నంబర్ వన్ స్థానం సాధించాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం సంతోషంగా ఉంది. కష్టపడి చదివిన విద్యార్థులు భవిష్యత్ వివిధ రంగాల్లో రాణిస్తారు. పరీక్షల సమయంలో సహకరించిన పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– ఎ. రవీందర్రెడ్డి. జిల్లా విద్యాశాఖ అధికారి
జూన్ 3నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు..
జూన్ 3ను నుంచి 13 వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. మే 16వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. లేట్ ఫీజు రూ. 50 ఫైన్తో జూన్ 1వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు.

‘టెన్త్’ ఫలితాల్లోనూ బాలికలదే హవా