
దుస్తులు ఆరేస్తూ మృత్యుఒడికి..
తొర్రూరు : దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం డివిజన్ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఫత్తేపురం గ్రామానికి చెందిన ఓరుగంటి శైలజ(35), వీరేశ్ దంపతులు కొంత కాలంగా తొర్రూరులో అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త ఆటో నడుపుతుండగా శైలజ ఇళ్లలో పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. రోజుమాదిరిగానే దుస్తులు ఉతికి ఇంటి ఎదుట ఉన్న వైరుపై ఆరేస్తుండగా ఆ తీగకు విద్యుత్ ప్రసరించి షాక్ తగిలింది. దీంతో అపస్మారక స్థితికి చేరిన శైలజను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఇంట్లో దుస్తులు ఆరేసేందుకు వైరు ఏర్పాటు చేయడంతోనే శైలజ మృతి చెందిందంటూ ఇంటి యజమానిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈఘటనపై వీరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాంజీ నాయక్ తెలిపారు.
మర్రిపల్లిగూడెంలో చెరువులో పడి మరో మహిళ..
కమలాపూర్: చెరువులో పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని మర్రిపల్లిగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తోట సుగుణ (55) సోమవారం సాయంత్రం తమ గేదెను మేతకు తీసుకెళ్లింది. అనంతరం ఇంటికి వస్తున్న క్రమంలో నడిమికుంటలో చెరువులో గేదెకు నీరు తాగించడానికి తీసుకెళ్లింది. అక్కడ గేదె ఒక్కసారిగా చెరువులోకి సుగుణను లాక్కెళ్లడంతో ఆమె నీట మునిగింది. సుగుణ రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం చెరువులో మృతి చెంది కనిపించింది. మృతురాలికి భర్త, ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరికృష్ణ తెలిపారు.
● విద్యుత్ షాక్తో మహిళ మృతి
● తొర్రూరులో ఘటన

దుస్తులు ఆరేస్తూ మృత్యుఒడికి..