
పురుగుల మందు తాగి యువకుడి బలవన్మరణం
జనగామ రూరల్ : పురుగుల మందు తాగి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జనగామ మండలంలోని గోపిరాజుపల్లిలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గోపిరాజుపల్లికి చెందిన పిడుగు అనిల్ (22) వ్యవసాయం చేసుకుంటు కుటుంబ సభ్యులతో జీవిస్తున్నాడు. వ్యవసాయంతో పాటు ఇతర కూలీ పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. సోమవారం రాత్రి గ్రామశివారులో పొలం వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వెంటనే జనగామ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కాగా మృతికి గల పూర్తి విషయాలు తెలియరాలేదు. అయితే విషయం తెలుసుకున్న మృతుడి అన్న పిడుగు రమేశ్ తమ్ముడి మరణం తట్టుకోలేక అదే ఆస్పత్రిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. డాక్టర్లు వెంటనే చికిత్స అందజేయగా ఎలాంటి ప్రమాదం లేకపోవడం ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై, పోలీసులు తెలిపారు.
తమ్ముడి మరణం తట్టుకోలేక
అన్న ఆత్మహత్యాయత్నం