
రేవంత్రెడ్డి కుట్ర.. పోలీసుల అమలు
హన్మకొండ : రజతోత్సవ సభను విఫలం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పన్నిన కుట్రలను పోలీసులు అమలు చేశారని బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూజర్ చార్జీలు వసూలు చేసిన పోలీసు శాఖ అరకొరగా సిబ్బందిని కేటాయించిందని, గతంలో ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ వద్ద యూజర్ చార్జీలు వసూలు చేసిందా అని ప్రశ్నించారు. 2,000 మంది పోలీసు సిబ్బందిని కేటాయిస్తామని చెప్పి 20 మందిని కూడా ఇవ్వలేదన్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి వెళ్లి తాను ట్రాఫిక్ క్లియర్ చేశామన్నారు. సభకు రైతులు స్వచ్ఛందంగా స్థలం ఇచ్చారన్నారు. ఆ భూములను తిరిగి యథావిధిగా తయారు చేసి రైతులకు అప్పగిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్ను ప్రజలు గుండెలో పెట్టుకున్నారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఏ రోజు డ్యూటీలు చేయని రవాణా శాఖ అధికారులు ఆదివారం సెలవు రోజైనా రోడ్లపైకి వచ్చి సభకు వస్తున్న వాహనాలను తనిఖీ చేసి అడ్డంకులు సృష్టించారని ధ్వజమెత్తారు. హనుమకొండ, ములుగు రోడ్డులో తనిఖీలు చేశారని అదే సమయంలో తానుంటే వారిని బట్టలూడదీసి ఉరికించేవాడినని మండిపడ్డారు. సమావేశంలో నా యకులు పులి రజనీకాంత్, భీరవెళ్లి భరత్ కుమార్ రెడ్డి, పోలంపల్లి రామ్మూర్తి, బి.వీరేందర్, రవీందర్ రావు. పానుగంటి శ్రీధర్, దూలం వెంకన్న, నయిముద్దీన్ పాల్గొన్నారు.
రజతోత్సవ సభ ఇన్చార్జ్,
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి