
కేయూలో విద్యార్థుల ఆందోళన
కేయూ క్యాంపస్ : వేసవి సెలవుల నేపథ్యంలో 1వ తేదీనుంచి కాకతీయ యూనివర్సిటీలో హాస్టళ్లు, మెస్లను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్పీ రాజ్కుమార్ సర్క్యులర్ కూడా ఇటీవలనే జారీచేశారు. దీనిని వ్యతిరేకిస్తూ కేయూలోని హాస్టళ్లు, మెస్లను యథావిధిగా కొనసాగించాలని మూసివేయవద్దని, సెలవులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పీజీ కోర్సుల విద్యార్థులు పరిపాలన భవనంలో ఆందోళనకు దిగారు. కొంతమంది విద్యార్థులతో వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, పాలకమండలి సభ్యుడు బి.సురేష్ లాల్ వివిధ యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాల్స్ చర్చించారు. వేసవిలో హాస్టళ్లు, మెస్లను మూసివేస్తారని వారు విద్యార్థులకు తెలియజేశారు.తాము వివిధ పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్నామని అందువల్ల హాస్టళ్లను, మెస్లను కొనసాగించాలని విద్యార్థులు కోరారు. ఈనెల 30న అన్ని విభాగాల అధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వీసీ విద్యార్థులకు తెలియజేయడంతో వారు ఆందోళన విరమించారు.
హాస్టళ్లు, మెస్లను
మూసివేయొద్దని డిమాండ్