
‘భూ భారతి’తో భూ సమస్యలు పరిష్కారం
● నూతన చట్టంతో పకడ్బందీగా
రెవెన్యూ రికార్డులు
● అవగాహన సదస్సులో
కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్,
ఎమ్మెల్యే కోరం కనకయ్య
బయ్యారం/గార్ల: ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం దొరకుతుందని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శనివారం బయ్యారం, గార్ల మండలాల్లో ఏర్పాటు చేసిన భూ భారతి ఆర్ఓఆర్ చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొన మాట్లాడారు. భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత విప్లవాత్మకమైన, పారదర్శకంతో ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ఈ చట్టం ద్వారా సాధ్యమవుతుందన్నారు. వ్యక్తిగతంగా తప్పులు చేయడానికి అవకాశం లేకుండా వ్యవస్థను అవినీతి రహితంగా మార్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో భూ భారతి చట్టం పూర్తిగా అమల్లోకి వస్తుందని, రైతులు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అంతకుముందు ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా వ్యవసాయాధికారిణి విజయనిర్మల, సర్వే ల్యాండ్ ఏడీ నరసింహమూర్తి, ఏడీఏ శ్రీనివాసరావు, డీపీఓ హరిప్రసాద్, తహసీల్దార్ విజయ, ఎంపీడీఓలు విజయలక్ష్మి, మంగమ్మ, దుర్గాప్రసాద్, ఏఓ రాంజీ, సొసైటీ చైర్మన్ మధుకర్రెడ్డి, నాగేశ్వరరావు, ప్రవీణ్కుమార్, వెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల సర్వే, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శనివారం ఇందిరమ్మ ఇళ్లు తదితర వాటిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కళ నెరవేర్చేందుకే ఈ పథకం ప్రవేశ పెట్టిందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్టొప్పో, కె వీర బ్రహ్మచారి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, గృహ నిర్మాణ పీడీ రాజయ్య, అధికారులు పాల్గొన్నారు.