● కొత్త పింఛన్లు రాలేదని రాయండి
● ‘సూపర్సిక్స్’అమలు కాలేదని
ప్రచురించండి
● ఒక పత్రికపై జయమనోజ్రెడ్డి ధ్వజం
ఆదోని అర్బన్: పిచ్చి రాతలు రాస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఒక పత్రికపై ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తనయుడు జయమనోజ్రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జగనన్న కాలనీలో విజిలెన్స్ విచారణ జరుగుతోందని ఆరోపణలు రావడంపై రెండు రోజుల క్రితమే తన తండ్రి చట్టపరంగా ఎదుర్కోవడానికి ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారన్నారు. అలాంటిది ఏకపక్షంగా ఒక పత్రిక రాయడంపై మండిపడ్డారు. రాసే ముందు తన వివరణ తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పటివరకు రెండేళ్లయినా అభివృద్ధి చేయలేదని, అయినా ఆ పత్రిక రాయలేదన్నారు. ఎమ్మెల్యే పార్థసారథిపై ఆరోపణలు వస్తే వాటిని పక్కదోవ పట్టించేందుకు అవాస్తవాలు రాస్తున్నారన్నారు. సూపర్సిక్స్ పథకాలు అమలుకాక, ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఆ పత్రికకు కనపడటం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇంత వరకు కొత్త పింఛన్లు ఇవ్వలేదని, దానిపై రాయాలని సూచించారు.
అభివృద్ధి కనిపించదా?
తన తండ్రి హయాంలో ఆదోనిలో జరిగిన రోడ్ల వెడల్పు, అభివృద్ధి గురించి ఆ పత్రికకు కనిపించదా అని జయమనోజ్రెడ్డి ప్రశ్నించారు. మెడికల్ కళాశాల నిర్మాణం దాదాపు రూ.450 కోట్లతో చేపట్టినా, టీడీపీ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసినా ఎప్పుడూ ఆ పత్రిక రాసింది లేదన్నారు. ఆదోనికి డిగ్రీ కళాశాల తెచ్చింది తన తండ్రే అని, శాశ్వత భవనం లేదని, ప్రభుత్వం నిర్మించాలని రాయొచ్చు కదా అని ప్రశ్నించారు. వాటి గురించి రాస్తే ప్రజలు ఎంతో సంతోషిస్తారు కదా అన్నారు. తాము ఎప్పుడూ ఇక్కడే ఉంటామని, ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ స్వభావం ఎలాంటిదో ఇక్కడున్న 2.50 లక్షల మంది ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో లీగల్ అడ్వైజర్ జీవన్సింగ్ పాల్గొన్నారు.


