
బదిలీలు.. రాయ‘బేరాలు’
రెవెన్యూలో అన్ని కేడర్లలో కలిపి
200 మంది ఉద్యోగుల దరఖాస్తు
తహసీల్దార్ పోస్టులకు పెద్ద మొత్తంలో డబ్బుల డిమాండ్
సిఫార్సు లేఖల కోసం భారీగా వసూళ్లు
సోషల్ మీడియాలో సిఫార్సు లేఖలు హల్చల్
కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ శాఖలో బదిలీల పర్వం పైరవీలు తొక్కుతోంది. ఫోకల్ స్థానం కోసం పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. బదిలీకి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ సిఫార్సు లేఖ కోసం ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్తున్నారు. వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి లేఖలను సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రెవెన్యూ శాఖలో అన్ని క్యాడర్లలో కలిపి 200 మంది ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒకే స్థానంలో ఐదేళ్లు పనిచేసినా ఉద్యోగులను కచ్చితంగా బదిలీ చేయాలి. అనారోగ్యం, స్పౌజ్, మూచ్యువల్ తదితర విషయాల్లోనే బదిలీలు ఉంటాయి. జూన్ 2వ తేదీలోపు బదిలీ ప్రక్రియను ముగించాలని గడువును విధించింది. ఈక్రమం పైరవీల పర్వం ప్రారంభమైంది.
భారీ వసూళ్లు
తహసీల్దార్ క్యాడర్ పోస్టు బదిలీ సిఫార్సు లేఖ కోసం పెద్ద మొత్తంలో కొందరు ప్రజాప్రతినిధులు వసూలు
చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నగరానికి 80 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో తహసీల్దార్ పోస్టు కోసం రూ.10 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, వీఆర్వోల బదిలీలకు కూడా సిఫార్సు లేఖల కోసం కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా డబ్బులు తీసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. కాగా.. వీఆర్వోల బదిలీలకు ‘పచ్చ’ నేతలు భారీ వసూలు చేసినట్లు ప్రచారం ఉంది. అంతేకాక కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా వసూళ్ల పర్వం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో మంత్రి సిఫార్సు లేఖ వైరల్
ఉద్యోగుల బదిలీల్లో ప్రజాప్రతినిధులు జోక్యం ఎక్కువగా ఉందని ఉదాహరణగా చూపుతూ మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కర్నూలులోని ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్లో జోనల్ మేనేజర్గా పనిచేస్తున్న ఎన్.వెంకటరాముడు తన సిఫార్సు లేఖను ఏకంగా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారు. ఆయన్ను జిల్లా సివిల్ సప్లై మేనేజర్గా బదిలీ చేయాలని ఆ లేఖలో ఉంది. గుట్టుగా ఉండాల్సిన సిఫార్సు లేఖలు ఏకంగా సోషల్ మీడియాకు ఎక్కాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.