గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి

Jun 26 2025 6:10 AM | Updated on Jun 26 2025 6:10 AM

గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి

గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఉద్యోగోన్నతులు కల్పించాలని ఏపీ గ్రామ సర్వేయర్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో సర్వేయర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన మూడు రిలే నిరాహార దీక్ష బుధవారం ప్రారంభమైంది. దీక్షలో పాల్గొన్న అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.మధుబాబు, ప్రధాన కార్యదర్శి పి. సాయికిరణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పర్యాయాలు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. గ్రామ సర్వేయర్ల హేతుబద్ధీకరణ తర్వాతే ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టాలన్నారు. బదిలీల్లో స్థానిక మండలం నిబంధనను తొలగించాలని కోరారు. ఇప్పటికే పిల్లలకు పాఠశాలలు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు బదిలీలు చేస్తే స్కూల్స్‌ మారడం ఇబ్బందికరంగా, ఆర్థికంగా భారంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రక్షాళన చేయాలని భావిస్తే పై క్యాడర్‌ నుండి కింది స్థాయి క్యాడర్‌ వరకూ వారి పరిధిని బట్టి స్థానిక నిబంధన వర్తింపజేయాలని కోరారు. హేతుబద్ధీకరణ ప్రక్రియ చేసే ముందు ప్రమోషన్‌ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలియజేయాలని డిమాండ్‌చేశారు. ఎటువంటి సిఫార్సులను అనుమతించకుండా పారదర్శకంగా బదిలీలు చేయాలని విజ్ఞప్తిచేశారు. అసోసియేషన్‌ ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

గ్రామ సర్వేయర్ల అసోసియేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement