
పీఆర్సీ కమిషన్ను నియమించండి
ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని పెండింగ్ డీఏలు, పాత బకాయిలను చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. చిరంజీవి కోరారు. నగరంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. చిరంజీవి మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమైన వెంటనే ట్రైనింగ్స్ పెట్టి ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయటం సరికాదన్నారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి. సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షితులయ్యేలా విద్యావిధానాలను రూపొందించాలన్నారు. ఆన్లైన్ పనులతో పాటు బోధనా సమయాన్ని హరించకుండా చూడాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ. దస్తగిరి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్ల బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. లంకేష్, గౌరవాధ్యక్షుడు ఎం. రామబ్రహ్మం, సంఘ నాయకులు పాల్గొన్నారు.