
క్రియా యోగాతో ఆనందకరమైన జీవితం
విజయవాడ కల్చరల్: క్రియా యోగాతో ఆనందకరమైన జీవితం పొందవచ్చని స్వామి స్మరణానందగిరి స్వామి పేర్కొన్నారు. యోగదా సత్సంగ ధ్యానకేంద్రం విజయవాడ శాఖ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని రామకోటిలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా ఆదివారం ఆయన భారతీయ యోగా అంశంగా ప్రసంగించారు. భారతీయ రుషులు మనకు అందించిన అద్భుతమైన ప్రక్రియ యోగా అన్నారు. భారతీయ యోగా పట్ల ప్రపంచం ఆసక్తి చూపుతోందన్నారు. దీని వల్ల శరీరంలో వస్తున్న హానికరమైన మార్పుల నుంచి విముక్తి కలుగుతోందన్నారు. జీర్ణప్రక్రియలో మార్పులు కలిగి స్వస్థత కలుగుతుందన్నారు. ధ్యాన పద్ధతులను వివరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నట్లు తెలిపారు. న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. స్మరణానంద స్వామిని కలెక్టర్ లక్ష్మీశ, హజరత్తయ్య గుప్తా సత్కరించారు.