సీటు కోసం పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీటు కోసం పాట్లు

Jun 23 2025 6:55 AM | Updated on Jun 23 2025 6:55 AM

సీటు కోసం పాట్లు

సీటు కోసం పాట్లు

జి.కొండూరు: నిలబడేందుకు నీడ లేక, కూర్చునేందుకు అవకాశం లేక గురుకులంలో ప్రవేశం కోసం కౌన్సెలింగ్‌కు వచ్చిన అభ్యర్థులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. గురుకుల బాలికల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ ప్రక్రియ గురుకుల పాఠశాలల జిల్లా కో ఆర్డినేటర్‌ మురళీకృష్ణ పర్యవేక్షణలో జరిగింది. అయితే కౌన్సెలింగ్‌లో సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో అభ్య ర్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు నరక యాతన పడ్డారు. అందరూ ఐదో తరగతిలో ప్రవేశం కోసం వచ్చిన చిన్న వయస్సు బాలికలు కావడంతో వారికి ప్రత్యేక వసతులు లేక ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం తొమ్మిది గురుకుల బాలికల పాఠశాలలు ఉండగా అన్ని పాఠశాలల్లో మిగిలిన వంద సీట్ల భర్తీ కోసం ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 970మంది అభ్యర్థులు, వారి వెంట తల్లిదండ్రులతో కలిపి 2వేల మందికిపైగా హాజరయ్యారు. వీరికి నిలబడేందుకు కనీసం టెంటు సౌకర్యం లేక, తినేందుకు తిండిలేక, మైకులు లేకపోవడంతో కౌన్సెలింగ్‌లో ఏ పేర్లు పిలుస్తున్నారో అర్థం కాక అభ్యర్థులు ఆందోళన చెందారు.

తల్లిదండ్రుల ఆగ్రహం..

వంద సీట్ల కోసం అన్ని వందల మందిని కౌన్సెలింగ్‌కు ఎందుకు పిలిచారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా అత్యంత దారుణంగా కౌన్సెలింగ్‌ను నిర్వహించారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పాఠశాల హెచ్‌ఎం కె.బ్యూలాని వివరణ కోరగా అన్ని వసతులు కల్పించామన్నారు. తక్కువ సీట్ల కోసం ఎక్కువ మంది హాజరు కావడం వల్ల సీట్లు రాని వారు అసంతృప్తి వ్యక్తం చేశారని వివరణ ఇచ్చారు.

కుంటముక్కల గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్‌ కనీస మౌలిక వసతులు లేక అభ్యర్థుల నరకయాతన వంద సీట్ల కోసం 970మంది పోటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement