
ఉత్సాహంగా స్నాతకోత్సవం
గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరులో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ 24వ స్నాతకోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ డాక్టర్ నూతలపాటి వెంకటరమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమాన అవకాశాలు, సామాజిక చలనశీలతను నిర్ధారించడానికి నాణ్యమైన విద్య శాశ్వత సాధనాల్లో ఒకటి అని ఆయన పేర్కొన్నారు. అది అందించడంలో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ముందుందని కొనియాడారు. ఈ స్నాతకోత్సవంలో 1,165 మంది విద్యార్థులు హాజరై ప్రొవిజనల్ సర్టిఫికెట్లను ముఖ్య అతిథి ఎన్.వి.రమణ చేతుల మీదుగా ఆయా విభాగాల విభాగాధిపతులు, అధ్యాపకుల సమక్షంలో అందుకున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థినులు వరుసగా కొమ్ము సుప్రియ (9.65), గంజి స్నేహలత (9.52), ఈలపర్తి ప్రియాంక (9.51) అకడమిక్ టాపర్స్గా నిలవడం విశేషం. 33మంది విద్యార్థులు ఆనర్స్ డిగ్రీ పూర్తి చేయగా, 17మంది విద్యార్థులు మైనర్స్ డిగ్రీ పూర్తి చేసి అదనంగా 18క్రెడిట్స్ సాధించారు.
అన్నింట్లో ముందంజ..
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్ మాట్లాడుతూ విద్యా సంబంధిత విషయాలలోనే కాకుండా క్రీడా విభాగంలో సహితం కళాశాల విద్యార్థులు ముందంజలో ఉన్నారన్నారు. 25మంది విద్యార్థులు యూనివర్సిటీ బ్లూస్గా జేఎన్టీయూకే కాకినాడకు ప్రాతినిధ్యం వహించి, అంతర్ విశ్వ విద్యాలయం, అంతర్ రాష్ట్ర టోర్నమెంట్లలో పాల్గొని అనేకానేక పతకాలు, ట్రోఫీలు గెలుచుకున్నారని చెప్పారు. అంతర్ కళాశాలల అథ్లెటిక్స్లలో 17బంగారు పతకాలు, 10వెండి పతకాలు, 4రజత పతకాలు సాధించారన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విద్యార్థిని కె.అనిత రికార్డు స్థాయిలో అత్యధికంగా 253 పాయింట్లు సాధించి బెస్ట్ ఔట్ గోయింగ్ స్టూడెంట్గా నిలవడం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. ముందుగా కళాశాల ఎన్ఎస్ఎస్ బ్యాండ్ బృందం, ఎన్సీసీ క్యాడెట్స్ నుంచి ఎన్.వి.రమణ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయనను కళాశాల చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ ముసునూరి శ్రీనివాసరావు, సెక్రటరీ– కరస్పాండెంట్ వల్లూరుపల్లి సత్యనారాయణ, కో సెక్రటరీ – కరస్పాండెంట్ వల్లూరుపల్లి రామకృష్ణ తదితరులు జ్ఞాపికను అందించి, దుశ్శాలువాతో సత్కరించి సన్మాన పత్రాన్ని సమర్పించారు.