
రక్తదానంతో ప్రాణం నిలబడుతుంది
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
లబ్బీపేట(విజయవాడతూర్పు): రక్తదానం అనేది ఒక స్వచ్ఛంద చర్య అని, ఇది అనేక మంది రోగులకు నూతన జీవనాన్ని అందిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గాయాలు, శస్త్ర చికిత్సలు, సికిల్ సెల్ అనీమియా, తలసేమియా, కాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే వారికి రక్తం అత్యవసరం అవుతుందని, రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు.
నగరంలో వీకేఆర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరావతి రోటరీ బ్లడ్ బ్యాంకును ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఆల్ ఇండియా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ ఫెడరేషన్ డైరెక్టర్ జనరల్ రావి ఉదయభాస్కర్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రక్తం కొనుగోలు, కుటుంబ సభ్యుల దానంపై ఆధారపడుతున్నట్లు తెలిపారు. విజయవాడలో రెడ్క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ వంటి సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి అధ్యక్షులు ప్రఫుల్, రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం. వెంకటేశ్వరరావు సహాయ గవర్నర్ డాక్టర్ హర్ష, కార్యదర్శి వినయ్ తదితరులు పాల్గొన్నారు.