
జీవన విధానంలో యోగా ఒక భాగం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని వార్డు సచివాలయాల ప్లానింగ్ కార్యదర్శులు, యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుసంపన్న, ఆరోగ్య, ఆనంద ఆంధ్రాకు తొలి అడుగు యోగాంధ్ర అని చెప్పారు. 30 రోజులుగా జిల్లాలో గ్రామగ్రామాన, పట్టణాల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శరీరంలోని అన్ని వ్యవస్థలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చే శక్తి యోగాసనాలకు ఉందని పేర్కొన్నారు. ఒత్తిడిని మన జీవితంలోకి అడుగుపెట్టనివ్వకుండా యోగాసనాలు రక్షణ కవచాల్లాగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రతిరోజూ యోగాంధ్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, ఎన్సీసీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె.రమేష్, ఫిజికల్ డైరెక్టర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ