
జూలై 9న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్కుమార్
కృష్ణలంక(విజయవాడతూర్పు): కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉద్యోగుల, కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ిసీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక రాణిగారితోటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు అధ్యక్షతన శనివారం సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజయ్కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికవర్గ హక్కులను కాలరాసేందుకే లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో కార్మికులకు రక్షణ లేని ఉద్యోగాల్లో నియమించి శ్రమ దోపిడీ చేసేందుకు ఈ పద్ధతి తీసుకొచ్చారని మండిపడ్డారు. సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సి.హెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి నరసింహారావు, డి.కాశీనాథ్, కె.దుర్గారావు, ఎన్.సి.హెచ్.సుప్రజ, కార్యదర్శులు ఎం.మహేష్ సుధాకర్, ఈ.వి. నారాయణ, ఎ.కమల, గోపాల్ బి.వెంకటేశ్వరరావు, కోశాధికారి ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.