
ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన
విమానాశ్రయం(గన్నవరం): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను సాధరణ పరిపాలన శాఖ జీఏడీ ప్రధాన కార్యదర్శి ముఖేష్కుమార్ మీనా ఆదేశించారు. విమానాశ్రయంలో జరుగుతున్న ప్రధాన మంత్రి పర్యటన ఏర్పాట్లను శాంతి భద్రతల ఏడీజీపీ మధుసూదన్రెడ్డి, ఐజీ అశోక్కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. అంతర్జాతీయ టెర్మినల్లోని వీఐపీ లాంజ్రూమ్, ప్రధాని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటైనర్ విరామశాల, హెలికాప్టర్లు దిగే ప్రదేశాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు మీనా దిశానిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్.గంగాధరరావు, సహాయ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సమీక్ష
అనంతరం ప్రధాని పర్యటన ఏర్పాట్లపై జేసీ, ఎస్పీతో కలిసి కలెక్టర్ బాలాజీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లపై ఎస్పీజీ అధికారులు మంగళవారం సాయంత్రం ఏఎస్ఎల్ సమావేశం నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. విమానాశ్రయంలో అగ్నిమాపక యంత్రాలు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించాలని సూచించారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటైనర్ విరామశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, ఎయిర్పోర్ట్లో దెబ్బతిన్న టైల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.ఎల్.కె.రెడ్డి, ఆర్డీఓలు బాలసుబ్రహ్మణ్యం, హేలా షారోన్, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్బాబు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, ఆర్టీఓ శ్రీనివాసరావు, ప్రొటోకాల్ అధికారి మోహన్రావు, డ్వామా పీడీ శివప్రసాద్ పాల్గొన్నారు.