
ప్రతి సమస్యకు పరిష్కారం
మీకోసంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్: మీకోసం కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల పోలీసులు సానుకూలంగా స్పందించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మసలుకోవాలని చెప్పారు. వయోవృద్ధులు, వికలాంగులు, బాలింతలు న్యాయం కోసం వస్తే వారి సమస్యలను సామరస్యంగా ఆలకించటంతో పాటు సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.
అర్జీలు...
● మచిలీపట్నంకు చెందిన ఓ వివాహిత ఎనిమిది నెలల క్రితం తనకు వివాహం జరిగిందని, వివాహ సమయంలో అత్తింటి వారు అడిగినంత కట్న కానుకలను తన పుట్టింటి వాళ్లు ఇచ్చినప్పటికీ అదనపు కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్త తనను మానసికంగా వేధిస్తున్నారంటూ వాపోయింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినప్పటికీ వారిలో ఏ మార్పు లేదని, న్యాయం చేయమని ప్రాధేయపడింది.
● పామర్రు నుంచి రోహిత్ అనే యువకుడు తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా, తన సమీప బంధువు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడని, ఉద్యోగం విషయంపై మాట్లాడుతుంటే రెండు సంవత్సరాలుగా ఎలాంటి సమాధానం చెప్పకపోగా తమపై దూషణకు పాల్పడుతూ బెదిరిస్తున్నాడని, న్యాయం చేయమని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
● గన్నవరం నుంచి 70 సంవత్సరాల వృద్ధుడు తనకు ఇద్దరు కుమారులు ఉండగా, ఇరువురికీ వివాహం జరిగిందని, తన భార్య మరణించినప్పటి నుంచి కొడుకులెవరూ భోజనం కూడా పెట్టటం లేదని కన్నీరు పెట్టుకున్నాడు. ఆస్తి మొత్తం వాళ్ల పేరిట రాసి తాను ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని, శారీరక దాడికి పాల్పడుతున్నారని, న్యాయం చేయమని ప్రాధేయపడ్డాడు. బాధితుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.