
‘కంపోస్టు’.. కంపల్సరీ
రెబ్బెన(ఆసిఫాబాద్): సెగ్రిగేషన్ షెడ్లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే కంపోస్టు ఎరువుల తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక నుంచి సెగ్రిగేషన్ షెడ్లలో ఎరువులు తయారీ తప్పనిసరిగా కానుంది. గత ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతీ జీపీలో సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించింది. ఇప్పటివరకు చాలాచోట్ల కంపోస్టు ఎరువుల తయారీ తూతూమంత్రంగా సాగుతోంది. అదనపు ఆదాయం రాకపోగా కంపోస్టు ఎరువుల తయారీ కోసం ఉపయోగించే వానపాములు, పశువుల పేడ కొనుగోలు తదితర ఖర్చుల భారం పంచాయతీలపై పడుతోంది.
సేంద్రియ ఎరువులకు డిమాండ్..
సేంద్రియ సాగు పెరగడంతో సేంద్రియ ఎరువులకు కూడా బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఏ ర్పడింది. ఈ తరుణంలో పంచాయతీలు కంపో స్టు ఎరువుల తయారీపై దృష్టి సారిస్తే అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి కిలోకు రూ.20 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. వర్మీ కంపోస్టు ఎరువుకు కావాల్సిన ప్రధానమైన ముడి సరుకు తడిచెత్త. పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ ఇళ్ల నుంచి తడిపొడి చెత్త సేకరిస్తున్నా రు. పొడి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి, తడి చెత్తను మాత్రం సెగ్రిగేషన్ షెడ్లలో కంపోస్టు ఎరువు తయారీ కోసం వినియోగించాలి. కానీ చాలాచోట్ల సిబ్బంది తడిపొడి చెత్తను వేరు చేయకుండా నిప్పు పెడుతున్నారు. తడి చెత్తను కంపోస్టు ఎరువుల తయారీకి ఉపయోగించకపోవడంతో సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగా మారా యి. కొన్ని జీపీల్లో సెగ్రిగేషన్ షెడ్లను సమర్థవంతంగా వినియోగించుకుంటూ వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. నర్సరీల్లోని మొక్కల పెరుగుదల, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. మిగిలిన ఎరువును రైతులకు విక్రయిస్తున్నారు.
334 సెగ్రిగేషన్ షెడ్లు..
జిల్లాలోని 334 గ్రామ పంచాయతీల్లో 334 సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించారు. వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ కోసం ప్రత్యేకంగా పిట్ సైతం ఏర్పాటు చేశారు. పిట్లో వానపాములు, ఎరువులు, మట్టి తడిచెత్త వేసి కొన్నిరోజుల పాటు నీళ్లు పట్టి వదిలేస్తున్నారు. నాణ్యమైన కంపోస్టు తయారీకి 45 రో జులపాటు తప్పనిసరిగా నీళ్లు పోయాలి. కౌటా ల, జైనూర్, కాగజ్నగర్, రెబ్బెన, పెంచికల్పేట్, దహెగాం మండలాల్లోని కొన్ని పంచాయతీల్లో మాత్రం కంపోస్టు ఎరువుల తయారీని సమర్థవంతంగా చేపడుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 15 టన్నుల వరకు వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేసి విక్రయించినట్లు అధికారులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీల్లో తయారు చేసిన వర్మీ కంపోస్టు ఎరువులో నుంచి 29,683 కిలోల వరకు హరితహారం కోసం వినియోగించారు. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల కోసం వినియోగించుకోగా.. మిగిలిన 847 కిలోల ఎరువును రైతులకు విక్రయించారు. దీని ద్వారా రూ.27,788 అదాయం సమకూరింది. అలాగే 2,838 కిలోల డ్రైవేస్ట్ విక్రయం ద్వా రా రూ.41,522 అదనపు అదాయం పంచాయతీ లు పొందాయి. అన్ని పంచాయతీల్లోనూ ఈ ప్రక్రి య సజావుగా కొనసాగితే అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇటీవల పంచాయతీరా జ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక కమిషనర్ షఫీ యుల్లా సెగ్రిగేషన్ షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. వర్మీ కంపో స్టు ఎరువులు తయారు చేయాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సైతం సెగ్రిగేషన్ షెడ్లో వేరు చేసి వ్యర్థాలను రీసైకింగ్కు పంపించాలని సూచించారు. జిల్లాలో లభ్యమయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలను బట్టి ఒకటి లేదా రెండు ప్యాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లను ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.
సెగ్రిగేషన్ షెడ్లను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు
ఎరువుల తయారీ ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం
ప్లాస్టిక్ వ్యర్థాల లభ్యతకు అనుగుణంగా పీడబ్ల్యూఎం యూనిట్లు
సౌకర్యాలు లేనిచోట కష్టమే..
జిల్లాలోని అన్ని పంచాయతీల్లో సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించినా సౌకర్యాలు కల్పించలేదు. ఎరువుల తయారీకి తప్పనిసరిగా నీటి సౌకర్యం అందుబాటులో ఉండాలి. తడి చెత్తను సెగ్రిగేషన్ షెడ్లకు తరలించేందుకు దారి సౌకర్యం ఉండాలి. నేటికీ చాలా వాటికి దారి లేదు. గ్రామాల్లో పోగయ్యే చెత్తను ఖాళీ ప్రదేశాల్లో పారపోసి నిప్పంటిస్తున్నారు. సౌకర్యాలు లేని షెడ్లలో కంపోస్టు ఎరువుల తయారీ కష్టమేనని పంచాయతీ సిబ్బంది పేర్కొంటున్నారు.