● పరీక్ష రద్దుతో విద్యార్థుల్లో ఆందోళన ● కష్టపడి సిద్ధమయ్యామంటూ వెల్లడి ● మరోమారు పరీక్షకు సన్నద్ధతపై భిన్నాభిప్రాయాలు
ఖమ్మంసహకారనగర్: మెడికల్ కాలేజీల్లో యూజీ ప్రవేశాలకు ఈ నెల 3వ తేదీన నిర్వహించిన ‘నీట్’ను రద్దు చేశారు. రాజస్థాన్లో ప్రశ్నాపత్రం లీకై నట్లు నిర్ధారణకు వచ్చిన జాతీయ పరీక్ష వ్యవస్థ (ఎన్టీ) దర్యాప్తు సంస్థల విచారణతో ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రం మార్పు లేకుండా, మరోమారు ఫీజు చెల్లించే అవసరం లేకుండా త్వరలో ఇంకోసారి పరీక్ష నిర్వహిస్తామని చెబుతున్నా.. కష్టనష్టాలకోర్చి సిద్ధమైన విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పరీక్ష కీ చూసుకుని మంచి మార్కులు సాధిస్తామని, తప్పక సీటు వస్తుందని నమ్మకంతో ఉన్న విద్యార్థులు రద్దయిందనే సమాచారంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఎదుర్కొంటున్నారు.
ప్రత్యేక శిక్షణతో..
కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు పలువురు రూ.లక్షలు ధారపోసి లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. కంటిమీద కునుకు లేకుండా పుస్తకాలతో కుస్తీపట్టారు. అంతేకాక తాజాగా ఇంటర్ చదివిన వారు షార్ట్టర్మ్ శిక్షణతో నీట్ లక్ష్యంగా సన్నద్ధమయ్యారు. ఇందుకోసం తల్లిదండ్రులు తమ పొదుపు మొత్తాన్ని వెచ్చించారు. కానీ పరీక్ష రద్దు కావడంతో వారిలో నిరాశ అలుముకుంది. ఎంతో శ్రమించి సన్నద్ధమై ఒకసారి పరీక్ష రాశాక.. మళ్లీ రాయడమంటే ఆ స్థాయిలో ఏకాగ్రత సులువు కాదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. పేపర్ లీక్ పరిణామం తెలివైన విద్యార్థులకు తీరని నష్టం చేకూరుస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయాన దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


