ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగులు, కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఖమ్మంలోని ఆర్ఎం కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా రీజినల్ మేనేజర్ ఎ.సరిరామ్ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిపోల వారీగా కార్యాలయాల్లో కాక రీజినల్ స్థాయిలోనూ ప్రతీ మంగళవారం గ్రీవెన్స్డే నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు మెరుగు రవీంద్రనాథ్ ఆధ్వర్యాన పదోన్నతుల్లో అవకతవకలను అరికట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అలాగే, డీఎం కార్యాలయంలో మేనేజర్ శివప్రసాద్కు మహిళా కార్మికులు తమ సమస్యలను వివరించారు. రాత్రి 11 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి రావడంతో ఇబ్బంది ఎదురవుతోందని, డిపోలు, బస్టాండ్లలో సరైన రెస్ట్ రూమ్స్ లేక అవస్థ పడుతున్నామని మహిళా కండక్టర్లు తెలిపారు.


